సిటీబ్యూరో, జూన్ 26(నమస్తే తెలంగాణ): ఒక రోడ్డు ప్రమాదం…ముగ్గురు అజాగ్రత్తను బయటపెట్టింది. ఈ కారణంగా ఓ మైనర్ బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసిన సైబరాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులపై 304-పార్ట్2 కింద కేసు పెట్టి 14 రోజుల పాటు జైలుకు పంపారు. విచారణలో ఈ నేరం రుజువైతే ఆ ముగ్గురికి 10 ఏండ్ల జైలు ఖాయం. గత నెల 27న మియాపూర్ ప్రాంతంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగి ఓ 15 ఏండ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేయగా వాహనం నడిపిస్తున్న రాజ్కుమార్కు అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేదని తెలిసింది. దీనికితోడు అతను మద్యం సేవించి ఉన్నాడని ప్రాథమికంగా స్పష్టమైంది. ఈ ద్విచక్రవాహనాన్ని ఎవరు ఇచ్చారని ఆరా తీస్తే యజమాని మహ్మద్ జహింగీర్గా తెలుసున్నారు. వాహన నంబర్ను పరిశీలిస్తే అది తేడగా కనిపించింది.
జహింగీర్ను నిలదీస్తే ఈ వాహనం పంజాబ్ రిజిస్ట్రేషన్తో కొన్నానని తనకు వాహనం అమ్మిన మెరాజ్ ఖాన్ నంబరు ప్లేటును టీఎస్గా మార్చమని చెప్పడంతో మార్చానని వివరించాడు. దీంతో మెరాజ్ఖాను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఇలా ఒక ప్రమాదం ముగ్గురి నిర్లక్ష్యాన్ని, మోసాన్ని బయటపెట్టింది. కావునా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకు వాహనాలను ఇవ్వొద్దు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను సొంతంగా మార్చుకుని తిరుగొద్దు. మద్యం సేవించిన వారికి అసలు వాహనాన్ని ఇవ్వొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఇలా నిర్లక్ష్యానికి కారణమయ్యే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.