అబిడ్స్, జనవరి 18 : కరోనా కట్టడికి వైద్య సిబ్బంది పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. థర్డ్ వేవ్ విస్తరిస్తుండడంతో కరోనా తగ్గుమఖం పట్టేలా వైద్య శాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మొదటి, రెండో వేవ్లో మాదిరిగానే కరోనాను కట్టడి చేసేందుకు సిబ్బంది పాటు పడుతున్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారికి వైరస్ నిర్ధారణ ఐన వారికి మందుల కిట్లను పంపిణీ చేస్తున్నారు. వాటిని ఏ విధంగా వాడాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని పలు అర్బన్ ప్రైమరీ హెల్త్ కేంద్రాల్లో ప్రతి నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతున్నారు. 15 – 18 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాలకు పై బడిన వారికి మొదటి, రెండో డోస్లు, 60 ఏండ్లుపై బడిన వారు, ఫ్రంట్ వారియర్లకు బూస్టర్ డోస్ వేస్తున్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు వచ్చిన వారి పేర్లను నమోదు చేసుకుని వారికి ఏ వ్యాక్సిన్ అవసరమో తెలుసుకుని వారికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ అందుబాటులో ఉంచి వ్యాక్సిన్లను వేస్తున్నారు. ప్రతి నిత్యం రెండు వందలకు పైగా వ్యాక్సిన్లను ప్రతి యూపీహెచ్సీలలో వేస్తున్నారు. ఆగాపురా, బేగంబజార్, మహారాజ్గంజ్, ఇసామియాబజార్, బొగ్గులకుంట యూపీహెచ్సీలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయంగా మారుతున్నాయి. బస్తీ దవాఖానల్లో ఇతర రోగాలతో వచ్చే వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నారు. కరోనా విస్తరిస్తుండడంతో ప్రజలు ఎక్కడకు వెళ్లినా మాస్క్లను ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పోలీసులు మాస్క్లను ధరించని వారికి అపరాధ రుసుంవిధిస్తున్నారు.
వ్యాక్సిన్తో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు ..
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపడుతూనే సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. యాంటిజెన్తో పాటు ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం యూపీహెచ్సీలకు వచ్చే అనుమానితుల నుంచి శ్వాబ్ను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. యాంటిజెన్ పరీక్షల ఫలితాలను కొద్ది సేపట్లోనే వెల్లడిస్తున్న సిబ్బంది ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలను అనుమానితుల సెల్ఫోన్లకు మెసేజ్ పంపుతున్నారు. గతంలో యూపీహెచ్సీలో ప్రతి నిత్యం అరవై వరకు పరీక్షలు నిర్వహించే వారు ప్రస్తుతం వంద, అంతకు పైగానే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కరోనా నిర్ధారణ అయిన వారికి మందుల కిట్ల అందజేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కరోనా విస్తరిస్తుండడంతో అధికారులు కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని ప్రజలు పేర్కొంటున్నారు.