సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాలిప్పిస్తానంటూ వివిధ రాష్ర్టాల యువతులను నమ్మిస్తూ వారిని వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న ఫార్చూన్ హోటల్ వ్యవహారాన్ని సెంట్రల్ జోన్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఫహిల్వాన్గా, కాంగ్రెస్ నాయకుడిగా చలామణి అవుతున్న రాంనగర్ అఖిల్ను గత నెలలో అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ హోటల్ను సీజ్ చేయాలని సెంట్రల్ జోన్ డీసీపీ శరత్చంద్ర పవర్ ఆదేశాలు జారీ చేయడంతో, స్థానిక పోలీసులు, స్థానిక తాసీల్దార్ ప్రేమ్కుమార్ శుక్రవారం హోటల్ను సీజ్ చేశారు. ఇదిలాఉండగా.. ఉద్యోగాలంటూ నమ్మిస్తూ పశ్చిమబెంగాల్ నుంచి ఎక్కువగా యువతులను హైదరాబాద్కు రప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పశ్చిమబెంగాల్లో అఖిల్కు పరిచయమున్న ముఠా నాయకుడు ఎవరు అనే విషయాలపై ఆరా తీసిన పోలీసులు, పలువురు నిందితులను గుర్తించారు. అందులో ప్రధాన నిందితుడు ఎక్కడ దాక్కున్నా పట్టుకురావాలనే పట్టుదలతో సెంట్రల్ జోన్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
ఫార్చూన్ రెస్టారెంట్లో వ్యభిచారం నిర్వహించడంలో లోకంటో వెబ్సైట్ను నిర్వాహకుడు ఎక్కువగా ఉపయోగించినట్లు విచారణలో తేలింది. లోకంటోలో ఫోన్ నంబర్ను అందుబాటులో ఉంచి.. విటులను ఆకర్షిస్తూ, ఆన్లైన్లో డబ్బులు తీసుకుంటున్నారు. ఆ తర్వాతే విటులకు ఒక నంబర్ ఇచ్చి ఫార్చూన్ హోటల్కు రప్పించారు. లోకంటో వెబ్సైట్ ప్రభావం అమాయకుల జీవితాలపై పడుతున్నదని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఈ వెబ్సైట్కు నోటీసులు జారీ చేసేందుకు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.