హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఏ పాత్ర లేని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Kejriwal ) ను ఈడీ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఆప్ నేతలు (AAP leaders) శుకవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అరెస్టు చేశారు. మోదీ హఠావో..దేశ్కో బచావో అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ ఉత్తర భారత దేశంలో ఆప్ బలాన్ని చూసి ఎక్కడ ఓడిపోతామనే భయంతోనే ప్రధాని మోదీ( PM Modi) ప్రతిపక్ష పార్టీలపై ఈడీని ఉసుగొల్పుతున్నాడని ఆరోపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను(ED) బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను వేటాడేందుకు ఉపయోగించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి పక్షం, ప్రజాస్వామ్యం గొంతును అణిచివేసేందుకు కేంద్రం ఎమర్జెన్సీ పాలన కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
తక్షణమే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఈడీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్ కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, డాక్టర్ అన్సారీ, ఎంఏ మజీద్, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ మల్లంగి ,మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ మల్లోజు,అధికార ప్రతినిధులు జావీద్, అక్షయ్, మదన్ లాల్, హైదర్, టి రాకేష్సింగ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.