హైదరాబాద్ : ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలకు వల వేస్తూ.. 60 మంది నుంచి రూ. 4 కోట్లు వసూలు చేశాడు ఓ యువకుడు. బాధితుల ఫిర్యాదుతో.. ఆ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజమండ్రికి చెందిన జోగడ వంశీకృష్ణ బీటెక్ పూర్తి చేశాడు. ఇన్స్టాగ్రామ్లో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. తనకు తాను హై ప్రొఫైల్ వ్యక్తిగా అమ్మాయిలను నమ్మించాడు. అనంతరం అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ.. చాలా మంది యువతులు తన ఫ్రెండ్షిఫ్ కోసం తపిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేవాడు. అలా 60 మంది అమ్మాయిలను మోసం చేసి.. రూ. 4 కోట్ల వరకు దోచుకున్నాడు.
అమెరికాలో ఉండే ఓ యువతి(హైదరాబాద్) కూడా వంశీకృష్ణ చేతిలో మోసపోయింది. దీంతో ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వంశీకృష్ణపై గతంలో రాచకొండ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, ఖమ్మం, భీమవరం, వైజాగ్, కరీంనగర్, విజయవాడలో ఈ తరహా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.