వెంగళరావునగర్, అక్టోబర్ 22: అపరిచిత యువతితో మాట్లాడిన వీడియో కాల్తో ఓ యువకుడు సైబర్ నేరగాళ్లుకు చిక్కాడు. డబ్బు కోసం ఆ నేరగాళ్ల బెదిరించడంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పి.వి.రామప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ బాపట్లకు చెందిన పరుచూరి మణికంఠ(22) బీటెక్ పూర్తి చేశాడు.
సాఫ్ట్వేర్ శిక్షణ కోసం ఇటీవలే నగరానికి వచ్చాడు. ఎస్ఆర్ నగర్లోని శ్రీ లక్ష్మీనర్సింహా డీలక్స్ బాయిస్ హాస్టల్లో నాగవెంకట అజయ్సాయి, లక్ష్మీనారాయణ, అనిల్, అభిరామ్తో కలిసి ఓ గదిలో ఉంటున్నాడు. ఇటీవల మణికంటకు ఓ గుర్తు తెలియని యువతి వాట్సాప్ కాల్ చేయడంతో మాట్లాడాడు. దీంతో సైబర్ నేరగాళ్లు మణికంఠ నగ్న వీడియోను రూపొందించి బెదిరింపులకు పాల్పడ్డారు. తమకు డబ్బు చెల్లించాలని, లేదంటే నగ్న వీడియోను మిత్రులు, కుటుంబ సభ్యులకు పంపుతామని బెదిరించారు.
ఆగంతకుల డిమాండ్ మేరకు ఓసారి రూ.10 వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించాడు. అయినా వారి వేధింపులు ఆగలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందాడు. శనివారం సాయంత్రం గది నుంచి బయటకు వెళ్లిన సహచరుడు నాగ వెంకట అజయ్సాయికి ఫోన్ చేశాడు. రూ.5 వేలు కావాలని కోరాడు. తన వద్ద అంత డబ్బు లేదని అజయ్ సాయి చెప్పాడు. అజయ్సాయి రాత్రి తిరిగి వచ్చి చూస్తే గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. హాస్టల్ నిర్వాహకుడు మహేంద్ర, ఇతరులు కలిసి పోలీసులకు సమాచారమిచ్చారు. గది తలుపులు తెరిచి చూడగా.. సీలింగ్ ఫ్యాన్కు మణికంఠ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.