మన్సూరాబాద్, మే 27: పని చేస్తున్న హోటల్ తనదేనంటూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి జాతీయ బ్యాంకులో లోన్ తీసుకున్న ఓ మహిళపై ఎల్బీనగర్ పీఎస్లో కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోటల్ యజమాని పి.సురేశ్, స్థల యజమాని కుమారుడు కె.చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. ఎల్బీనగర్, కామినేని దవాఖాన ఎదురుగా ఉన్న ప్లాట్ నం.68ను 2015వ సంవత్సరంలో కనికారం కమలాక్షి నుంచి వనస్థలిపురంనకు చెందిన పి.సురేశ్ లీజుకు తీసుకున్నాడు. సదరు స్థలంలో బాలాజీ మెస్ పేరుతో హోటల్ను నిర్వహిస్తున్నాడు. కమలాక్షి 2016లో మృతి చెందడంతో ఆమె కుమారుడు చంద్రశేఖర్ నుంచి లీజును సురేశ్ పొడిగించుకుని హోటల్ను యథావిధిగా నడుపుతున్నాడు.
సురేశ్ వద్ద కొన్నేండ్లుగా భరత్కుమార్ అనే వ్యక్తి సూపర్వైజర్గా పని చేస్తున్న క్రమంలో 2021 ఆగస్టులో కరోనా సమయంలో అతడు మృతి చెందాడు. భరత్కుమార్ మరణంతో ఆయన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో ఆయన భార్య పత్తిపాక శోభను మేనేజర్గా నియమించాడు. సురేశ్కు ఇతర వ్యాపారాలు ఉండటంతో హోటల్కు రావడం తగ్గించాడు. దీంతో శోభ హోటల్ లీజును తన పేరున మార్చుకోవాలని పథకం వేసుకున్నది. 2016లో చనిపోయిన కమలాక్షి స్థలాన్ని తనకు 2022లో లీజుకు ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించిన శోభ.. సదరు పత్రాలతో ఓ జాతీయ బ్యాంకులో సుమారు రూ.25 లక్షల లోన్ తీసుకున్నది.
ఈ విషయం జనవరి 2023లో సురేశ్కు తెలిసి శోభను ప్రశ్నించగా.. తనకేమి తెలియనట్లు నటించింది. గట్టిగా ప్రశ్నించగా.. హోటల్ తనదేనంటే బెదిరింపులకు పాల్పడటమే కాకుండా ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు హోటల్ యజమాని సురేశ్, స్థల యజమాని కుమారుడు చంద్రశేఖర్ పూర్తి ఆధారాలు చూపడంతో శోభ నకిలీ పత్రాలు సృష్టించినట్లు తెలిసింది. దీంతో సురేశ్, శోభపై గత నెలలో ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాటి నుంచి శోభ కనిపించకుండా పోయింది. ఈ విషయంపై ఎల్బీనగర్ ఎస్సై మధును వివరణ కోరగా.. త్వరలో శోభను వెతికి అరెస్ట్ చేస్తామని తెలిపారు.