శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 4: గచ్చిబౌలి పరిధిలో మహిళపై లైంగికదాడి, ఆ తర్వాత హత్య.. కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హంతకుడితో పాటు విషయాన్ని దాచిపెట్టిన మరో ఇద్దరిని కూడా గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో మాదాపూర్ డీసీపీ సందీప్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన శ్యామల్ రాయ్(27) నగరానికి వలసొచ్చి గచ్చిబౌలి ఐటీ కారిడార్లోని ఓ సంస్థ భవన నిర్మాణ పనుల్లో సెంట్రింగ్ కూలీగా పనిచేస్తున్నాడు. సమీపంలోని లేబర్ క్యాంపులో నివసిస్తున్నాడు.
అతడికి గౌలిదొడ్డి కేశవ్నగర్కు చెందిన ఎం.కాశమ్మతో పరిచయం ఏర్పడింది. కాశమ్మ మొదటి భర్త ఓ హత్య కేసులో జైలుకు వెళ్లగా.. కేశవ్నగర్కు చెందిన సాంబయ్యను రెండో భర్తగా వివాహం చేసుకుంది. ఇటీవల కాశమ్మకు తన కూతురు లక్ష్మితో గొడవ జరిగింది. దీంతో గతనెల 27న ఇంట్లో నుంచి వెళ్లిన కాశమ్మ.. తనకు పరిచయమైన శ్యామల్రాయ్ను కలిసింది. ఇద్దరు కలిసి ఐటీ కారిడార్లోని విప్రో సర్కిల్లో ఉన్న ఓ సంస్థ భవనంలోకి వెళ్లారు. అప్పటికే తమవెంట తెచ్చుకున్న మద్యం సేవించారు. శ్యామల్రాయ్ మద్యం మత్తులో కాశమ్మపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం కాశమ్మ గొంతుకు చీరకొంగుతో ఉరివేసి చంపడంతో పాటు బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు.
కాసేపటికి సమీపంలోనే తాను నివసిస్తున్న లేబర్ క్యాంపు వద్దకు వెళ్లి తోటి సెంట్రింగ్ కూలీలు అశోక్కుమార్ సర్కార్(23), అలోక్ సర్కార్(25)కు జరిగిన విషయం చెప్పాడు. అనంతరం ముగ్గురు లేబర్ క్యాంపు నుంచి పశ్చిమ బెంగాల్కు పరారయ్యారు. స్థానికుల సమాచారంతో 29న కాశమ్మ మృతదేహాన్ని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. శ్యామల్రాయ్ హత్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు.. అతడి స్వగ్రామానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు హత్య ఘటనను దాచిపెట్టిన అశోక్కుమార్, అలోక్సర్కార్ను కూడా అరెస్టు చేసి, నగరానికి తీసుకొచ్చారు. శ్యామల్రాయ్పై ఐపీసీ సెక్షన్లు 376, 302, నేరం దాచిపెట్టిన అశోక్కుమార్, అలోక్సర్కార్పై 202 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ముగ్గురిని రిమాండ్కు తరలించారు. పశ్చిమబెంగాల్లో దాగి ఉన్న నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులను మాదాపూర్ డీసీపీ సందీప్ అభినందిస్తూ.. వారికి నగదు బహుమతులను అందజేశారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జేమ్స్బాబు, డీఐ రాఘవేందర్ పాల్గొన్నారు.