జీడిమెట్ల, మే 15 : అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య, ప్రియుడిని జగద్గిరిగుట్ట పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా, కృత్తివెను మండలం, మట్టం గ్రామానికి చెందిన జయకృష్ణ(36), దుర్గాభవానీ (26) భార్యాభర్తలు. వీరిది ప్రేమ వివాహం కాగా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చి ఆల్విన్ కాలనీ పరిధి కమలాప్రసన్ననగర్లో ఉంటుండగా జయకృష్ణ జిమ్ ట్రైనర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతడికి చందానగర్లో నివాసముండే తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన చిన్నా (22) స్నేహితుడు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా దుర్గాభవానీ, చిన్నా అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తున్నారు. 25 రోజుల కిందట తమ సొంత ఊరుకు వెళ్లిన జయకృష్ణ అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ విషయాన్ని తన భార్యకు చెప్పగా ఇష్టం లేని ఆమె ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. ఈ నెల 10వ తేదీన ఆల్విన్ కాలనీలోని ఇంటిని ఖాళీ చేసేందుకు వచ్చిన జయకృష్ణతో చిన్నా పూటుగా మద్యం తాగించాడు. అనంతరం దుర్గాభవానీ, చిన్నా కలిసి జయకృష్ణ ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. చుట్టు పక్కల వారికి అనుమానం రాకుండా ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు నమ్మించారు. అయితే జయకృష్ణ మృతిపై అనుమానం ఉన్నదని అతడి తండ్రి తిరుమణి వడ్డికాసుల జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దుర్గాభవానీ, చిన్నా వ్యవహారంపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు.