బంజారాహిల్స్,డిసెంబర్ 1: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని శాసనసభ ఎన్నికల్లో మొత్తం 52.07శాతం ఓటింగ్ నమోదైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో 53.74శాతం మంది ఓటేయగా ఈసారి స్వల్పంగా తగ్గింది. నియోజకవర్గంలో మొత్తం 2,96,014 ఓటర్లు ఉండగా వారిలో 154,146 మంది ఓటేశారు. ఓటు వేసిన వారిలో 79,507మంది పురుష ఓటర్లు ఉండగా 74,624మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలోనే అత్యధికంగా ఫిలింనగర్లోని గీతాంజలి స్కూల్లో ఏర్పాటు చేసిన 179 పోలింగ్ కేంద్రంలో 71.15శాతం పోలింగ్ శాతం నమోదైంది.
అత్యల్పంగా జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని రౌండ్టేబుల్స్కూల్లోని 174 పోలింగ్ కేంద్రంలో నమోదైంది. ఇక్కడ కేవలం 33.88శాతం మాత్రమే ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. గతంలో కాలనీలు, అపార్ట్మెంట్స్కు చెందిన పోలింగ్ కేంద్రాల్లో అతి తక్కువ పోలింగ్ కేంద్రం నమోదయ్యేది. అయితే ఈసారి ఎన్నికల్లో కాలనీలలో సాధారణం కంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో గతంలో కంటే స్వల్పంగా ఓటింగ్ శాతం పెరిగింది. అయితే బస్తీల్లోని కొన్ని పోలింగ్ బూత్లలో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తక్కువ ఓట్లు నమోదైన ప్రాంతా ల్లో ఓటింగ్ సరళి ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారు.