సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులేంటి..? నీటి లభ్యత ఎంత? ఏ పంటలు సాగు చేస్తే దిగుబడికి అవకాశం ఉంది.? తెగుళ్ల భయమేంత? దిగుబడికి తగినంత మార్కెట్ ఉందా? డిమాండ్ మేరకు ధరలు ఎలా ఉన్నాయి.? స్టోరేజీ సామర్థ్యం ఎంత? ఇలా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని రైతులే నేరుగా వ్యవసాయం చేసేలా పటాన్చెరులోని ఇక్రిసాట్ సంస్థ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రాంతీయ, సంప్రదాయ పద్ధతులకు శాస్త్రీయతను జోడించి వ్యవసాయ విధానాలకు అనుగుణంగా ఆగ్రో డేటాను ఇక్రిసాట్ తీర్చిదిద్దుతున్నది. వ్యవసాయ ఆధారిత డేటాను తయారు చేయనున్నది.
ఐటీ శాఖ ఫ్రేమ్ వర్క్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా డేటాను రూపొందించేందుకు చర్యలు చేపట్టినట్లుగా ఐటీ శాఖ సెక్రటరీ జయేశ్రంజన్ వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ డేటా మేనేజ్మెంట్ పాలసీ రూపకల్పనకు ఫ్రేమ్ వర్క్ జరుగుతున్నదని ఇటీవల ఇక్రిసాట్ వ్యవసాయ శాస్త్రవేత్తలతో జరిగిన వెబినార్లో వివరించారు. ఇది పూర్తి విశ్వసనీయమైన డేటా షేరింగ్కు వీలుగా ఉంటుందని పేర్కొన్నారు. రైతులు తమ పరిమితులకు లోబడి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా డేటా పాలసీ ఉంటుందని వెల్లడించారు.
ప్రస్తుతం ప్రాథమిక దశలో..
రైతులకు సాధారణ అవగాహన కల్పించడం కంటే.. విశ్వసనీయత కలిగిన సమాచారాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా ఇక్రిసాట్ సంస్థ ప్రత్యేక డేటా పాలసీని రూపొందిస్తున్నది. దీనికి తెలంగాణ ఐటీ శాఖ, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, జెరోనిమస్ అకాడమీ ఆఫ్ డేటా సైన్స్, జీరో హంగర్ ల్యాబ్, టిల్బర్గ్ యూనివర్సిటీ సంయుక్తంగా డేటా ఇన్ ైక్లెమెట్ రెసిలెంట్ అగ్రికల్చర్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫారమ్ను అందుబాటులోకి తీసుకురానున్నది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉండగా.. రానున్న రోజుల్లో రైతులే సులభంగా తెలుసుకునేలా డేటాను సిద్ధం చేయనున్నారు.
రైతులకు లాభాలు తెచ్చేందుకే..!
దేశంలో వాతావరణ మార్పుల కారణంగా పంట దిగుబడి అంచనాల కంటే ఏటా 15-18శాతం మేర తగ్గుతున్నది. దీంతో చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు విధాన మార్పుల ద్వారా వాతావరణ మార్పులను తట్టుకోలేక ప్రతి పంట కాలంలో 12-15శాతం ఆదాయాన్ని కోల్పోతున్నారనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏ పంట వేయాలి.? ఏ పంటకు అవసరమైన నీరెంతా? పంట కాలం, నేలను బట్టి వాడాల్సిన ఎరువులు, మార్చాల్సిన పంట రకాలు వంటి అంశాలను సులభంగా అర్థమయ్యేలా సాగు విధానాలను అవలంభించేందుకు ఈ డేటా సాయపడుతుందని ఇక్రిసాట్ వర్గాలు చెబుతున్నాయి.