మారేడ్పల్లి, మార్చి 18: రైలెక్కే క్రమంలో ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన నీలం సుమంత్ (20) ఎల్బీనగర్లో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే, ఆదివారం తన సొంత ఊరుకు వెళ్లేందుకు తన సోదరుడితో కలిసి సుమంత్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చాడు. జనరల్ టికెట్ తీసుకొని ప్లాట్ ఫారం నంబర్ 1లో వేచి ఉన్నాడు.
18.40 గంటల సమయంలో ప్లాట్ ఫారంపైకి గోదావరి ఎక్స్ప్రెస్ రైలు రావడంతో.. జనరల్ కోచ్ బోగీలో ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు సుమంత్ రైలు, ప్లాట్ ఫారం మధ్యలో పడటంతో స్పృహతప్పిపోయాడు. వెంటనే అతడి సోదరుడు ప్రయాణికుల సహాయంతో సుమంత్ను పైకి తీసుకొచ్చి ఆటోలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.