బేగంపేట్ జూన్ 21: అన్ని మతాలు, సంస్కృతులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో లోక కల్యాణార్థం నిర్వహించిన శాంతి యాగం, చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాలు, రంజాన్, క్రిస్మస్ పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు.
రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాసం బోనాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, ఇందుకు తగినట్టు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. బోనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారని చెప్పారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేసిందని తెలిపారు. సుమారు 1200 కోట్లతో చరిత్రలో నిలిచి పోయేలా యాదాద్రి ఆలయాన్ని ప్రభుత్వం పునర్ నిర్మాణం చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈవో గుత్తా మనోహర్రెడ్డి , మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.