సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలగాణ) : జేఎన్టీయూ హైదరాబాద్ను మరింత మెరుగైన విధంగా అభివృద్ధి పరుచాలన్న లక్ష్యంతో యూనివర్సిటీ అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. అకాడమిక్ అంశాలు, విద్యార్థులకు, టీచింగ్ ఫ్యాకల్టీకి పలు రకాల శిక్షణా కార్యక్రమాలు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే బీటెక్ పూర్తి చేసే విద్యార్థులకు మంచి కంపెనీలలో ప్లేస్మెంట్ వంటి పలు రకాలుగా ఇప్పటికే తమ సేవలు అందిస్తున్న జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల కోసం క్యాంపస్లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అందుకోసం ఒక ప్రత్యేక డైరెక్టర్ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. అందుకు సంబంధించి గురువారం జరిగిన వర్సిటీలో వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పలు విభాగాల అధికారుల సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దేశ విదేశాలలో జేఎన్టీయూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో చదువుకున్న యూనివర్సిటీకి తమ వంతు సహాయం చేయాలన్న లక్ష్యంతో.. ఇప్పటికే చాలా మంది పూర్వ విద్యార్థులు జేఎన్టీయూలో అకాడమిక్, ఇంగ్లిష్, ఇతర నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమాలు ఉచితంగా అందిస్తున్నారు. కాగా, యూనివర్సిటీ క్యాంపస్లోనే పూర్వ విద్యార్థుల విభాగాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
డైరెక్టర్గాప్రొఫెసర్ సురేశ్కుమార్ నియామకం..
జేఎన్టీయూలో కొత్తగా పూర్వ విద్యార్థుల విభాగాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఆ విభాగానికి తొలి డైరెక్టర్గా ఆ యూనివర్సిటీలో మెకానికల్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సురేష్కుమార్ను నియమిస్తూ గురువారం ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందచేశారు.