మల్కాజిగిరి, మార్చి 24: ప్రజల ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. గత మూడు దశాబ్దాలుగా ఆనంద్బాగ్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఉన్న గేటు మూసిన ప్రతిసారి రెండు పక్కల్లో దాదాపు వేలాది వాహనాలు ట్రాఫిక్తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అప్పటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రజాప్రతినిధుల వద్దకు ప్రజలు, ఉద్యోగులు వినతిపత్రాలతో చెప్పులరిగేలా తిరిగారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆనంద్బాగ్ వద్ద ఆర్యూబీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి రైల్వే అధికారులకు పంపించారు. అయితే ఆనంద్బాగ్ ఆర్యూబీ ఫైల్ పెండింగ్లో పెట్టారు.
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావు ఎన్నికల సందర్భంగా ఆనంద్బాగ్ వద్ద ఆర్యూబీని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆర్యూబీని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా అక్కడ ఉన్న కొందరు అభ్యంతరాలు తెలుపడంతోపాటు కోర్టుకు వెళ్లారు. ఎమ్మెల్యే పట్టుదలతో అక్కడి వారితో సమావేశాలు నిర్వహించి సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపారు. స్థానికులు కూడా సహకరించడంతో ఆర్యూబీ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ వచ్చింది. దీంతో రూ.38 కోట్లతో ఆర్యూబీ నిర్మాణ పనులు పూర్తి చేసి గత రెండేండ్లుగా ప్రజలకు అందుబాటులో వచ్చింది.
బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలు ఆనంద్బాగ్ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్కు తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయని వినతిపత్రం అందజేశారు. వెంటనే వారికి ఆనంద్బాగ్ ఆర్యూబీ నిర్మిస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ ప్రకారం రూ.38 కోట్లతో ఆర్యూబీని పూర్తి చేశాం. స్థానికుల సహకారంతో అన్ని సమస్యలు పరిష్కరించి ట్రాఫిక్ సమస్యల నుంచి వాహనదారులకు ఇబ్బందులు తొలగించాం. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు పరుస్తున్నది.
– ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు