బంజారాహిల్స్, మే 9 : బంజారాహిల్స్లోని కేర్ దవాఖాన వైద్యులు 20 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించి ఓ వ్యక్తికి అత్యంత క్లిష్టమైన హార్ట్ బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. గుండెలో రక్తప్రసరణకు అడ్డంకులు కల్పిస్తున్న ప్రాంతాలను గుర్తించడంతో పాటు 10 చోట్ల బైపాస్ గ్రాఫ్ట్స్లను ఏర్పాటు చేశారు. మంగళవారం బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్కు చెందిన శ్రీకృష్ణ(61)కు కొంతకాలంగా మధుమేహంతో పాటు ట్రిపుల్ వెస్సెల్ కరోనరీ ఆర్టరీ సమస్యలు ఉన్నాయి. దీంతో తీవ్రమైన గుండెనొప్పితో ఇటీవల కేర్ దవాఖానలో చేరారు. గుండె రక్తనాళాలను పని చేసేలా చేయడం కోసం అత్యంత క్లిష్టమైన రెండంచెల బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. డా.ప్రతీక్ భట్నాగర్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం 20 గంటల పాటు శ్రమించి పదిచోట్ల బైపాస్ గ్రాఫ్ట్స్ను ఏర్పాటు చేసింది. దీంతో శస్త్రచికిత్స విజయవంతం అయింది. సర్జరీ అనంతరం పూర్తి స్థాయిలో కోలుకున్న శ్రీకృష్ణతోపాటు అతడి కుటుంబసభ్యులు మంగళవారం డా.ప్రతీక్ భట్నాగర్ను కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సీవోవో నీలేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.