హైదరాబాద్ : రెండు రోజుల క్రితం శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు కాల్ చేసిన మిరాజ్ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. మిరాజ్ సమాధానంతో రైల్వే పోలీసులు విస్తుపోయారు. పెళ్లి చేయిస్తానని మోసం చేసిన మహిళను బెదిరించేందుకే కాల్ చేసినట్లు తెలిపాడు. పెళ్లి చేయిస్తానని తన వద్ద రూ. 50 వేలు తీసుకుని మోసం చేసిందని పేర్కొన్నాడు. అందుకే రైలులో వెళ్తున్న ఆ మహిళ బుట్టలో బాంబు ఉందని ఫోన్ చేసి చెప్పినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని రెండో నంబర్ ప్లాట్ ఫారంపై శబరి ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి డయల్ 100కు కాల్ చేసి.. శబరి ఎక్స్ప్రెస్ రైల్లో బాంబు పెట్టాం.. అని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు బోగీలను తనిఖీ చేశారు. ప్రయాణికులు ఎవరూ ఆందోళనకు గురికావద్దని పోలీసులు సూచించారు. సూమారు 50 నిమిషాల పాటు రైలును తనిఖీ చేసిన అనంతరం బాంబు లేదని రైల్వే పోలీసులు నిర్ధారించారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులు రైలును ప్లాట్ ఫారం నుంచి పంపించారు.