Hyderabad | హైదరాబాద్ : పాతబస్తీలో పాకిస్తాన్కు చెందిన యువకుడిని బహదూర్పురా పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకుని, కిషన్బాగ్లో కాపురం పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
వివరాల్లోకి వెళ్తే.. బహుదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముండే ఒక వివాహిత మహిళకు ఇద్దరు పిల్లలు. ఆమె కొన్నాళ్ల క్రితం జీవనోపాధి కోసం దుబాయ్కి వెళ్లింది. అక్కడ ఆమె పనిచేసే చోట పాకిస్తాన్కు చెందిన ఫయాజ్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం పెండ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు ఇద్దరు అక్కడ కాపురం చేశారు. కాగా సదరు మహిళ మొదటి భర్త నుంచి తలాక్ తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా గతేడాది సదరు మహిళ దుబాయ్ నుంచి హైదరాబాద్కు తిరిగి రాగా, ఫయాజ్ కొన్నాళ్ల తరువాత తన సొంత దేశమైన పాకిస్తాన్కు వెళ్లాడు. ఇరువురు ఫోన్లలో మాట్లాడుకుంటుండగానే తాను గర్భావతినంటూ ఆమె చెప్పింది. దీంతో ఫయాజ్ గత నవంబర్ నెలలో పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా బీహార్లోకి అక్రమంగా ప్రవేశించి హైదరాబాద్కు చేరుకున్నాడు. సదరు మహిళను కలుసుకొని ఇద్దరు కలిసి కిషన్బాగ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇండియాలోకి వచ్చిన ఫయాజ్ విషయాన్ని నిఘా వర్గాలు గుర్తించి స్థానిక పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో గురువారం ఫయాజ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.