Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఎయిర్పోర్టు మెట్రో అలైన్మెంట్ను సూచించేలా హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒకటి చొప్పున చిన్న హద్దు రాయి, ప్రతి అర కిలోమీటరుకు ఒకటి చొప్పున పెద్దగా కనిపించేలా హద్దురాయిని ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లోనూ ఈ హద్దు రాళ్లు స్పష్టంగా కనిపించాలని రంగుల షీట్ను ఏర్పాటు చేస్తున్నారు. సరికొత్త విధానంలో ఏర్పాటు చేస్తున్న ఈ హద్దు రాళ్లతో మెట్రో ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందని, అదే సమయంలో ప్రాజెక్టు పనులు నిర్వహించేందుకు సులభతరంగా ఉంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టులో సరికొత్త విధానాలను పాటిస్తున్నారు. మెట్రో అలైన్మెంట్ను సూచించేలా హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 100 మీటర్లకు ఒక చిన్న హద్దు రాయి. ప్రతి అరకిలోమీటరు తర్వాత పెద్ద హద్దురాయి ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించేలా హద్దు రాయిపై రంగుల షీట్ను ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించేందుకు మెట్రో ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందని, అదే సమయంలో ప్రాజెక్టు పనులు నిర్వహించేందుకు ఇంజినీరింగ్ పరంగా సులభతరంగా ఉంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాయిదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ప్రతిపాదించిన 31 కి.మీ మార్గంలో సర్వే పూర్తయిందని, భూమి మీద పెగ్ మార్కింగ్ పేరుతో బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రోడ్డుపై సంప్రదాయ ఇంజినీరింగ్ పెగ్ మార్కులే కాకుండా రాత్రి సమయంలోనూ స్పష్టంగా కనిపించేందుకు రెట్రో రిప్లెక్టివ్ షీట్తో కూడిన అల్యూమినియం బోర్డులను సెంట్రల్ మీడియన్లో పెడుతున్నామని, ఇవి వరసగా ఆ మార్గంలో ఉంటాయని పేర్కొన్నారు.
ఎయిర్పోర్టు మెట్రో ప్రారంభ స్థానమైన రాయదుర్గం నుంచి పెగ్ మార్కులను ప్రతి 100 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత మళ్లీ అర కిలోమీటరుకు పెద్ద బోర్డులు పెడుతున్నామని తెలిపారు. కాగా ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో హద్దు రాళ్లను ఫుట్పాత్ వైపు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన పిల్లర్లు ఔటర్ రింగు రోడ్డు వెంబడి సర్వీసు రోడ్డు మధ్యలోని సెంట్రల్ మీడియన్లో ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
ఎయిర్పోర్టు మెట్రోకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. సర్వే పూర్తయి హద్దు రాళ్లను పాతిన తర్వాత భూసార పరీక్షలు నిర్వహించనున్నారు. మెట్రో పిల్లర్ ఏర్పాటు చేసే చోట భూసార పరీక్షలు చేసేందుకు భారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు. రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎత్తుగా ఉన్న భారీకేడ్లను రోడ్డు మధ్యలో ఉంచి మొదట భూసార పరీక్షలు, ఆ తర్వాత మెట్రో పిల్లర్ల నిర్మాణం పనులు చేపట్టనున్నారు.