Suicide | హైదరాబాద్ : పెద్దనాన్న నుంచి అత్యాచార వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య పాల్పడింది. ఈ ఘటన కొంపల్లి పరిధిలోని పోచమ్మగడ్డ ప్రాంతంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
పేట్ బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లాలోని వర్ని ప్రాంతానికి చెందిన దంపతులు బతుకుదెరువు కోసం కొంపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కుమార్తె(17) సుచిత్ర సమీపంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతుంది. బాలిక తండ్రి గతేడాది రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అంతకు ముందు తన అన్నతో కలిసి ఆయన మేడ్చల్లో ఫైనాన్స్ వద్ద రుణం తీసుకున్నారు. దీంతో తరచూ తన తమ్ముడి ఇంటికి వచ్చినప్పుడల్లా బాలికను వేధించేవాడు. వాటిని తట్టుకోలేక మనోవేదనకు గురైన బాలిక ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.