సిటీబ్యూరో, జనవరి 16(నమస్తే తెలంగాణ) : గ్లోబల్ సిటీ హైదరాబాద్లో వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేలా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా సిటీలో గాలి నాణ్యతను మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ (న్యాక్స్) ప్రకారం వాయు కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా ఉండగా ఢిల్లీ, ముంబై, ఇతర మెట్రో నగరాల కంటే ముందస్తుగా కాలుష్య నియంత్రణ చర్యలకు పీసీబీ యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా నగరంలో కాలుష్య కారకాలు, ఉద్గారాలు, నియంత్రణ చర్యలను ప్రధానాంశాలుగా తీసుకుని మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నది. ఈ క్రమంలో సిటీ నుంచి ఓఆర్ఆర్ వరకు 2/2 చదరపు కిలోమీటర్ల పరిధిని ప్రత్యేక గ్రిడ్గా విభజించి కాలుష్య కారకాలు, ఉద్గారాలపై అధ్యయనం చేసి నివేదికను ఐఐటీ కాన్పూర్ ప్రొ. ముఖేష్ శర్మ, తెలంగాణ పీసీబీ ఉన్నతాధికారులకు డ్రాఫ్ట్ నివేదికను అందజేసినట్లుగా సమాచారం.
పరిమితికి మించుతున్న పీఎం 2.5
పెరిగిన వ్యక్తిగత వాహనాల రద్దీ, నిర్మాణాల కారణంగా నగరంలో కొంత కాలంగా పీఎం 2.5 పరిమాణం పరిమితికి మించి నమోదవుతున్నది. నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ (న్యాక్స్) సూచించిన దాని కంటే ఎక్కువగా ఉన్నట్లుగా నివేదికలో పేర్కొన్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలో భవిష్యత్కు అవసరమయ్యేలా కాలుష్య నియంత్రణకు అనువైన ప్రణాళికలను అమలు చేయడానికి తాజాగా రూపొందించిన నివేదికనే కీలకం అవుతుందని పీసీబీ వర్గాలు వెల్లడించాయి.