మేడ్చల్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ)/బేగంపేట్: నల్గొండలో నేడు జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు, రైతులు తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి 10 వేల మంది తరలివెళ్లేలా సిద్ధమయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 2 వేల మంది తరలివెళ్లనున్నారు. నల్గొండ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల వాటా తేల్చకుండా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నల్గొండలో జరిగే సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న నీళ్ల పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలన్నారు. ఇప్పటికే రైతులందరూ నల్గొండ సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్నారు. నల్గొండ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు.
సోమవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కృష్ణ జలాల పరిరక్షణ, కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్ట్లను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సభను నిర్వహిస్తున్నట్టు వివరించారు. ప్రాజెక్ట్లను కేఆర్ఎంబీకి అప్పగిస్తే భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని చెప్పారు. మంగళవారం ఉదయం 9 గంటలకు మారేడ్పల్లిలోని మున్సిపల్ మైదానానికి శ్రేణులు చేరుకోవాలని అక్కడి నుంచి ర్యాలీగా నల్గొండ సభకు బయలు దేరనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలతా, మాజీ కార్పొరేటర్లు శేషుకుమారి, మల్లికార్జున్గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.