ఖైరతాబాద్, ఆగస్టు 3 : ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతుడే నేటి సమాజంలో కోటీశ్వరుడని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమాజిగూడలోని రాజ్భవన్ హైస్కూల్లో గురువారం వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యునైజేషన్ విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి.సుధీరా, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, కార్పొరేటర్ పి.విజయారెడ్డితో కలిసి విద్యార్థులకు నట్టల నివారణ మందులు వేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఆహారపదార్థాలు తినేటప్పుడు విద్యార్థులు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని, లేని పక్షంలో నులిపురుగులు కడుపులో ప్రవేశించి బలవర్ధకమైన ఆహారం శరీరానికి అందకుండా చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో సామ్యూల్ రాజ్, డిప్యూటీ ఐవోఎస్ శాంతాబాయి రాథోడ్, హైస్కూల్, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాళ్లు వీఏఎస్ కరుణశ్రీ, ఎన్. మంజులత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.