చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 7: మాటలతో నమ్మించి.. మోసం చేశారు. బర్త్డే పార్టీ పేరుతో ఓ బాలికపై ఆరుగురు యువకులు (మైనర్లు) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. ఛత్రినాక ప్రాంతానికి చెందిన ఓ బాలిక (బాధితురాలు) ఈనెల 4న పూల్బాగ్ చమాన్ వద్దనున్న ఓ మెడికల్ హాల్కు మందుల కోసం వెళ్లింది. అక్కడ ఆమెకు స్నేహితురాలు కలిసింది. లక్ష్మీనగర్లో మా చిన్నమ్మకు హోల్సేల్ దుకాణం ఉంది.. అక్కడ తీసుకుందాం.. అంటూ స్నేహితురాలు చెప్పడంతో ఇద్దరు కలిసి లక్ష్మీనగర్ వెళ్లారు.
ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్తానని చెప్పడంతో.. బోయగూడలోని స్నేహితుల ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది.. వెళ్దామని స్నేహితురాలు అడిగింది. రానంటూ బాలిక చెప్పినా.. బలవంతంగా తీసుకెవెళ్లింది. దీంతో ఇద్దరు కలిసి బోయగూడ బస్తీలోని ఓ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటిలో రెండు గదులు ఉన్నాయి. ఓ గదిలో కొంతమంది యువకులు ఉన్నారు. బాధిత బాలిక చూసిన యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. తీసుకువెళ్లిన స్నేహితురాలు అక్కడి నుంచి అదృశ్యమైంది.
బాధిత బాలిక భయంతో కేకలు వేసింది. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. వీలుపడలేదు. దాహం.. దాహం.. అంటూ బిగ్గరగా అరిచింది. దీంతో ఆ యువకులు స్టింగ్ అనే పేరుతో మత్తు కలిపిన కూల్ డ్రింక్ను బాలికకు ఇచ్చారు. ఆ కూల్ డ్రింక్ తాగిన బాలిక కొద్ది సేపటిలోనే స్పృహ కోల్పోయింది. కొంత సమయం తర్వాత బాలిక స్పృహలోకి వచ్చింది. బయటకు వచ్చి చూడగా తన శరీరంపై బట్టలు తీసి ఉన్నాయి. తనపై అత్యాచారం జరిగినట్లు గ్రహించిన బాలిక.. జరిగిన విషయాన్ని ఇంటికి వచ్చి తన తల్లితో చెప్పింది. తల్లి సహకారంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ ఘటనకు బాధ్యులైన ఆరుగురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ దర్యాప్తు చేస్తున్నారు.