శేరిలింగంపల్లి, జనవరి 30 : సీఐడీ అధికారులమంటూ గచ్చిబౌలిలోని ఓ ఐటీ సంస్థపై దాడిచేసిన ముఠా రూ.12.5 లక్షలు కొల్లగొట్టారు. మొత్తం రూ.2.3 కోట్లకు బేరం కుదుర్చుకొని సంస్థ డైరెక్టర్, ఉద్యోగులను కిడ్నాప్ చేసి సినీపక్కీలో హైడ్రామా కొనసాగించారు. చివరకు సంస్థ డైరెక్టర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన రాయదుర్గం పోలీసులు 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గచ్చిబౌలిలోని కార్యాలయంలో మాదాపూర్ డీసీపీ జి.వినిత్ మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గచ్చిబౌలి డైమండ్హిల్స్లో అజా యాడ్స్ ప్రైవేట్ లిమిటేడ్ సంస్థలో షేక్పేట్ ఓయూ కాలనీకి చెందిన అక్కెర రంజిత్కుమార్(47) మేనేజర్గా పనిచేసేవాడు. తనకు వేతన పెంపుతో పాటు ప్రమోషన్ ఇవ్వలేదని సంస్థపై పగతీర్చుకోవాలని భావించిన రంజిత్కుమార్ కర్నూల్ జిల్లా మైదకూర్ ప్రాంతానికి చెందిన అడ్వకేట్ పొలిమేర మహేంద్ర కుమార్(38)కి విషయం చెప్పాడు. మహేంద్రకుమార్ తనకు పరిచయం ఉన్న కర్నూల్ డీఐజీ కార్యాలయంలో ఎస్ఐగా పనిచేసిన సుజన్కు విషయం చెప్పాడు. ఈ క్రమంలో కడప జిల్లాకు చెందిన షేక్ మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్, విజయ్శేఖర్(32), బలిగ రాహుల్(33), దాడిబోయిన ఉబ్బకృష్ణ(40), పొన్నోలు సందీప్కుమార్(31), భూపతి రఘురామరాజు(33), రాజాతో కలిసి ముఠాగా ఏర్పడి సీఐడీ అధికారులుగా నకిలీ కార్డులు సృష్టించుకున్నారు. ఈ నెల 26న అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో అజా యాడ్స్ కార్యాలయంలో సీఐడీ అధికారులుగా దాడులు నిర్వహించినట్లు హడావుడి చేశారు.
సంస్థ డైరెక్టర్ దర్శన్ సుగుణాకర్ శెట్టిని పిలిచి రూ.2.3 కోట్లకు సెటిల్ చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటికప్పుడు సంస్థకు చెందిన మూడు బ్యాంకు ఖాతాల నుంచి రూ.71.80 లక్షలు ఇస్తామని తెలుపగా మొత్తం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు వచ్చే వరకు సంస్థకు చెందిన దర్శన్, హరిప్రసాద్, చేతన్లను తమ ఆధీనంలో ఉంచుకుంటామని డైరెక్టర్ సుగుణాకర్కు చెప్పి మాదాపూర్లోని ఓ హోటల్కు 27న ఉదయం తీసుకెళ్లారు. వారి వద్ద ఉన్న ఏటీఎం కార్డుల ద్వారా రూ.2.5 లక్షలు డ్రా చేయడంతో పాటు రూ.10 లక్షలు ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకొని వారిని హోటల్ గదిలోనే వదిలేసి పారిపోయారు. సుగుణాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రదాన సూత్రదారి మహేంద్రకుమార్తో పాటు గ్యాంగ్ సభ్యులు అబ్దుల్ ఖాదిర్, విజయ్శేఖర్, రంజిత్కుమార్, రాహుల్, సుబ్బకృష్ణ, సందీప్కుమార్, రఘురాజులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, దోపిడీకి ఉపయోగించిన 4 కార్లు, 16 సెల్ఫోన్లు, 2 ల్యాప్ట్యాప్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. సుజన్, రాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.