బేగంపేట్ జూలై 9: సికింద్రాబాద్ మోండా మార్కెట్ పాలిక బజార్లోని రెడీమేడ్ దుకాణంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే స్పందించి మంటలు అదుపుచేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పాలిక బజార్లోని ధమాక సేల్ రెడీమేడ్ బట్టల దుకాణంలో నుంచి ఉదయం 6 గంటల సమయంలో దట్టమైన పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్ల సహాయంతో రెండు గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు.
దుకాణంలోని బట్టలన్నీ పూర్తిగా కాలిపోయాయి. పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించకుండా అగ్ని మాపక సిబ్బంది చర్యలు చేపట్టింది. షాట్ సర్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, డీఆర్ఎఫ్ డైరెక్టర్, ఈవీడీఎం ప్రకాశ్రెడ్డి, డీఎఫ్వో మధుసూదన్, వివిధ శాఖల అధికారులు సందర్శించి పరిశీలించారు. అధికారులు ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ: మంత్రి తలసాని
నగరంలో అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యల అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అగ్నిప్రమాద సంఘటనా స్థలాన్ని మంత్రి సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు. అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తి నష్టం జరుగుతోందని, ఈ అంశంపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.