జీడిమెట్ల, మార్చి 26: ద్విచక్ర వాహన విషయంలో ఇద్దరి యువకుల మధ్య జరిగిన గొడవ ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని సుభాష్నగర్లో చోటు చేసుకుంది. జీడిమెట్ల ఎస్ఐ హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం… సుభాష్నగర్కు చెందిన జైలర్ సింగ్ (20 ) కూలీ. అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు సమీర్, జైలర్ సింగ్ కలిసి మూడు నెలల కిందట తాండూర్లో పని చేశారు. అక్కడ పనులు అయిపోవడంతో తిరిగి సుభాష్నగర్కు వచ్చారు. తాండూర్ నుంచి వచ్చే క్రమంలో జైలర్ సింగ్ తన ద్విచక్ర వాహనాన్ని తాండూర్లో వదిలేసి వచ్చాడు. ఆ ద్విచక్ర వాహనాన్ని సమీర్ తాండూర్ నుంచి తీసుకువచ్చే క్రమంలో వాహనాన్ని కింద పడేయడంతో బైక్ కొంత మేరా దెబ్బతిన్నది. తన బైక్ను రిపేరు చేయించి ఇవ్వాలని జైలర్ సింగ్ పట్టుబట్టాడు. ఒకవేళ రిపేర్ చేయించకపోతే నీ అంతు చూస్తానని బెదిరించాడు. నా అంతు చూసిన తర్వాతే ఈ బైక్ రిపేర్ చేయిస్తానని సమీర్ సమాధానమిచ్చాడు. సుభాష్నగర్ సమీపంలో మంగళవారం ఇరువురు కలుసుకున్నారు. ఇద్దరు మాట్లాడుకునే క్రమంలో మాటా మాట పెరగడంతో కోపోద్రిక్తుడైన సమీర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో జైలర్ సింగ్ గొంతు కోశాడు. స్థానికులు గమనించి జైలర్సింగ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.