ఖైరతాబాద్, అక్టోబర్ 5: యాచకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై హరీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్ట మసీదు వెనుక వైపు శివరాజ్, అతడి కొడుకు అనిల్, కోడలు జ్యోతి నివాసముంటున్నారు. కొన్నేళ్లుగా అక్కడే ఉంటూ యాచక వృత్తి చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఓ వ్యక్తివచ్చి.. అనిల్, మరోవ్యక్తి మధ్య పంజాగుట్ట మసీదు ప్రాంతంలో గొడవ జరుగుతున్నదంటూ శివరాజ్తో చెప్పాడు.
హుటాహుటిన కోడలను తీసుకొని అక్కడికి వెళ్లి చూడగా, అనిల్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. స్థానికుల సాయంతో వెంటనే 108 వాహనాన్ని రప్పించగా, అందులో ఉన్న సిబ్బంది పరీక్షించి అనిల్ మృతి చెందినట్లు నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. శ్రీను అనే యచకుడిపై అనుమానం ఉన్నదని, అతడే కొట్టి చంపాడని పేర్కొంటూ తండ్రి శివరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.