వ్యసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 5 : మట్టిని పొల్యూషన్ నుంచి ఎంత కాపాడితే.. ప్రకృతి మనకు అంత సహకరిస్తుందని కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.నీరజా ప్రభాకర్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ మృత్తిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో ఎర్ర, నల్ల రేగడి, ఇసుక నేలలు అధికంగా ఉన్నాయని, వాటి ప్రస్తుత పరిస్థితులపై వ్యవసాయ అనుబంధ శాస్త్రవేత్తలు పరిశోధలు మరింత పెంచాలన్నారు. సారవంతమైన నేల, ప్రకృతితోనే సమాజంలో ప్రతి జీవి మనుగడ ముడిపడి ఉందన్నారు. సారవంతమైన నేలకు తోడు జలవనరులు ఉంటేనే ఆహారం, నీరు, పర్యావరణ భద్రతకు భరోసా ఉంటుందని సూచించారు. గుప్పెడు మట్టిలో వెయ్యికోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని, ప్రధానంగా మొక్కల వేర్లు, జీవాల్లోని సేంద్రీయ కర్బనం, భూమిపై పెరిగే అడవులు, సారవంతమైన నేలలు వాతావరణంలోని కర్బనాన్ని స్థిరీకరించి పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న రసాయన సాగు విధానాలు, సేంద్రీయ ఎరువుల లభ్యత తగ్గడం, ఒకేతరహాలో పంటలు పండించడం, సాగు నీటి పద్ధతుల్లో లోపాలు, నేల కోతకు దారి తీస్తున్నాయన్నారు. సాగు భూములు కాలుష్యానికి గురికావడంతో నిస్సారంగా మారుతున్నాయని చెప్పారు. నేల కోతను అరికట్టేందుకు కాంటూరు సేద్యం, అంతర మిశ్రమ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. వర్మి కంపోస్టు, పచ్చిరొట్ట, జీవ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్యమైన నేలతోనే ఆహార ఉత్పత్తి పెరుగుతుందని నాగార్జున గ్రూఫ్ చైర్మన్ డా.రాజు అన్నారు. 2050 నాటికి ఆహార ధాన్యాల కొరత లేకుండా ఉండాలంటే దేశంలో పంటల మార్పిడి, కవర్ పంటల సాగు, జీవన ఎరువుల వాడకం పెంచాలన్నారు.
సహజ వనరుల వినియోగానికి పరిశ్రమలు, రైతులు సహకరించాలన్నారు. లిబర్టీ ఫౌండేషన్, ఎస్కేఎల్టీఎస్హెచ్యూ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు అగ్రిఫుడ్ టెక్ సంస్థ యాజమాన్యం డా.రవిశంకర్, కోరమండల్ ఫర్టిలైజర్ సంస్థ ప్రతినిధి జీవీ సుబ్బారెడ్డి, యూనివర్సిటీ డీన్ కిరణ్కుమార్, కళాశాల అసోసియేట్ డీన్ డా.ప్రశాంత్, రైతులు నాగరత్నం నాయుడు, పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మాధవ రెడ్డి, టీచింగ్ సైదయ్య, లక్ష్మీనారాయణ, సురేశ్ రెడ్డి, నిఖిల్, శ్రీరాములు, టీచింగ్, నాన్ టీచింగ్, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.