సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు 40 కేసుల్లో రూ.50 వేలకు మించి తరలిస్తున్న ఆధారాలు లేని రూ.1.63 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ నగదును జీడీసీకి సిఫార్సు చేయగా, అందులో 37 కేసులకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉండటంతో రూ.1.01 కోట్ల నగదును విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. జిల్లాలో రూ. 50 వేలకు మించి.. ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్న రూ.1.63 కోట్ల నగదును 40 మంది నుంచి ఎన్ఫోర్స్మెంట్ సీజ్ చేసిందని తెలిపారు. సీజ్ చేసిన నగదులో రూ.10 లక్షలకు మించి పట్టుబడిన రెండు కేసులను ఐటీ శాఖకు అప్పగించినట్టు చెప్పారు. ఒక కేసులో సీజ్ చేసిన రూ.3 లక్షల నగదును, సరైన ఆధారాలు సమర్పించనందున విడుదల చేయలేదని, సంబంధిత వ్యక్తులు సరైన ఆధారాలు చూపించి, డబ్బు విడుదల చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే జిల్లా గ్రీవెన్స్ కమిటీ చైర్మన్ 9618888110, కమిటీ కన్వీనర్ మొబైల్ నంబర్ 9177872240 లో సంప్రదించవచ్చని తెలిపారు. నగదు సీజ్కు గురైన వారు పూర్తి ఆధారాలతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ఎన్నికల నియమావళి అమలులో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లయింగ్ స్కాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.5.31 కోట్ల నగదు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. గడిచిన 24 గంటల్లో రూ.27.12 లక్షల నగదు, రూ.8.23 లక్షల విలువజేసే ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నగదు, ఇతర వస్తువులపై 12 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిశీలించామన్నారు. ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. 55 లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు తెలిపారు.