సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ దండగా, నేను చెప్పినట్లు స్టీలు, సిమెంట్ వ్యాపారం చేస్తే భారీ లాభాలొస్తాయంటూ నగరవాసికి రూ. 2.75 కోట్లు మోసం చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముషీరాబాద్, జమిస్తాన్పూర్కు చెందిన దాసరి కెన్నెత్ రోడ్రిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతడికి తన స్నేహితుడి ద్వారా అజ్మీరా రాజు అనే వ్యక్తి 2021 ఫిబ్రవరిలో పరిచయం అయ్యాడు. తనకు రెండు తెలుగు రాష్ర్టాల్లో పలువురు ప్రముఖులు, అధికారులతో పరిచయాలున్నాయని నమ్మించాడు. రియల్ ఎస్టేట్లో ఇంకా ఎన్నాళ్లుంటావు.. స్టీల్, సిమెంట్ రంగంలో పెట్టుబడులు పెట్టు.. నీకు ఊహించని లాభాలు చూపిస్తానంటూ అజ్మీరా కెన్నెత్ను నమ్మించాడు. ట్రయల్ కోసం రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టగానే.. వారం రోజుల్లో రూ. 20వేలు లాభం వచ్చిందంటూ కెన్నెత్ బ్యాంక్ ఖాతాలో జమ చేశాడు.
అజ్మీరాపై నమ్మకం పెరగడంతో దఫదఫాలుగా డబ్బు పెట్టుబడిగా పెడుతూ వెళ్లాడు. ఒకటి రెండుసార్లు లాభాలంటూ తిరిగి ఇచ్చిన అజ్మీరా గట్టి నమ్మకం కలిగిందనుకున్న తరువాత కెన్నెత్ నుంచి భారీఎత్తున లక్షల్లో తీసుకోవడం మొదలు పెట్టాడు. అతడి వద్ద లేకున్నా తన బంధువుల వద్ద సేకరించి పెట్టుబడిపెడుతూ వెళ్లాడు. కోటి రూపాయల చిట్టీలు వేసి, ఆ చిట్టీ ఎత్తిన డబ్బులు తమకు పెట్టుబడిగా ఇవ్వాలంటూ సూచనలు చేశాడు. తనకు సెక్రటేరియట్లో మంచి పట్టు ఉందని, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తానంటూ నమ్మించాడు. దుబాయ్లో ఒక ప్రముఖ వ్యక్తిని కలుద్దామని దుబాయ్కి తీసుకెళ్లి, అక్కడ ఎవరూ లేరని, సదరు వ్యక్తి తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయాడంటూ తిరిగి వచ్చేశారు. ఇలా దఫదఫాలుగా వివిధ పనుల కోసం రూ.2.75కోట్లు తీసుకొని మోసం చేశాడంటూ అజ్మీరాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.