సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఫైనాన్స్ కంపెనీ క్రిస్టల్క్లియర్.కో.ఇన్ కంపెనీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయంటూ నమ్మించి దాదాపు రూ.2 కోట్ల వరకు సేకరించి మోసం చేశారంటూ బాధితులు సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మాసబ్ట్యాంక్లోని క్రిస్టల్క్లియర్.కో.ఇన్ ఫైనాన్స్ సంస్థలో రాణిగంజ్కు చెందిన ఉమామహేశ్వరి రూ.4 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. డీఆర్డీఎల్లో సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్న సత్యనారాయణకు ఫైనాన్స్ సంస్థతో సంబంధాలు ఉన్నాయి.
సత్యనారాయణ చెప్పిన మాటలు నమ్మిన ఉమామహేశ్వరి నాలుగు లక్షలు పెట్టుబడిగా పెట్టింది. ఆమెతో పాటు మరో ఐదుగురితో కూడా రూ.20 లక్షలు పెట్టుబడిగా పెట్టించింది. ఇలా పలువురు దాదాపు రూ.2 కోట్ల వరకు ఫైనాన్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఇచ్చిన హామీ మేరకు లాభాలు తిరిగి చెల్లించకపోవడంతో సత్యనారాయణను నిలదీశారు. బాధితురాలు సంస్థ నిర్వాహకులను సంప్రదించి.. తాము పెట్టుబడిగా పెట్టిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరగా.. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.