మణికొండ, ఫిబ్రవరి 20: నార్సింగిలో మంగళవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చందానగర్ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన వంశీ (26), అతడి స్నేహితులు సాయికిరణ్, సీహెచ్. రాము, శ్రీశైలం, మధన్కుమార్ మంగళవారం తెల్లవారుజామున అప్పా జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు కారులో వెళ్తున్నారు.
మంచిరేవుల ఫారెస్ట్ ట్రేక్ పార్కు సమీపం వద్దకు రాగానే.. అతివేగంగా వెళ్తున్న వీరి కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగితా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.