జగద్గిరిగుట్ట, మార్చి 25: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో ఆర్టీసీ బస్డిపో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శాసనసభ ప్రతినిధులు కోరారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్తో సమావేశమై చర్చించారు. బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ.వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఇక్కడినుంచి నగరం, రాష్ట్రంలోని పలుప్రాంతాలకు వేలాదిగా ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారని ప్రస్తావించారు. వందల్లో సిటీ, జిల్లా బస్సులు రాకపోకలు ఉన్నా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవన్నారు.
ఈ ప్రాంతంలోని సర్వే నంబర్లు 223, 224, 237,238లోని ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయాలని కోరారు. నియోజకవర్గంలోని డబుల్బెడ్రూం కాలనీలనుంచి సరైన రవాణా ఉండేలా బస్సులు ఏర్పాటుచేయాలని సూచించారు. బాచుపల్లి, నిజాంపేట్, తెలుగుయూనివర్సిటీ, గండిమైసమ్మ, బాలయ్యనగర్ లాల్సాబ్గూడా, బహుదూర్పల్లి ప్రాంతాల నుంచి డిమాండ్ మేరకు బస్సులు కేటాయించాలని పేర్కొన్నారు. వినతిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బస్డిపో ఏర్పాటుపై ప్రణాళికకు హామీఇచ్చారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రిరాజశేఖర్రెడ్డి, నగర ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.