బంజారాహిల్స్, ఏప్రిల్ 18: చెప్పినా వినకుండా ద్విచక్రవాహనాన్ని తీసుకెళ్లిన కొడుకు.. దారిలో కారును ఢీకొట్టడంతో అది కొంత దెబ్బతిన్నది. కారు మరమ్మతులకు డ్రైవర్ రూ. 20 వేలు కావాలని బెదిరించాడు… మైనర్ అయిన కుమారుడిపై కేసు నమోదు కావొద్దంటే డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే చేతిలో చిల్లి గవ్వలేక.. తీవ్ర మానసిక సంఘర్షణకు గురైన ఆ బాలుడి తల్లి .చివరకు బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజమండ్రికి చెందిన వెంకటరమణ ఫిలింనగర్లోని దీన్ దయాళ్నగర్ బస్తీతో నివాసముంటూ కూలీ పనులు చేస్తుంటాడు. అతడి భార్య సూర్యకుమారి(35) ఓ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నది. వీరికి కొడుకు(14), కుమార్తె ఉన్నారు. బుధవారం ఉదయం సూర్యకుమారి డ్యూటీకి వెళ్లిపోగా, కొడుకు తల్లికి చెందిన ద్విచక్రవాహనాన్ని తీసుకుని శ్రీరామనవమి సందర్భంగా గుడికి వెళ్లొస్తానంటూ బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో హకీంబాబా దర్గా సమీపంలో ఓ కారును ఢీకొట్టాడు. దీంతో కారు కొంత దెబ్బతిన్నది. ఆగ్రహంతో కారు డ్రైవర్ చంద్రశేఖర్ బండి తాళం చెవిని తీసుకున్నాడు.
మరో స్నేహితుడు మహేశ్ను అక్కడకు పిలిపించాడు. వారిద్దరూ కలిసి ఆ బాలుడితో పాటు బండిని సమీపంలోని యజమాని ఇంటివద్దకు తీసుకెళ్లారు. కారుకు రిపేరు చేయాలంటే రూ.20వేలు అవుతుందంటూ..బాలుడి తండ్రికి చంద్రశేఖర్ ఫోన్ చేసి చెప్పాడు. సాయంత్రం 4గంటల్లోగా డబ్బులు ఇచ్చి బండి తీసుకువెళ్లాలని, లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పెద్ద కేసు అవుతుందని బెదిరించి ఆ బాలుడిని పంపించారు. ఇదే విషయాన్ని వెంకటరమణ తన భార్య సూర్యకుమారికి ఫోన్ చేసి చెప్పడంతో ఆమె తీవ్ర ఆందోళనతో ఇంటికి వచ్చింది. చేతిలో చిల్లిగవ్వలేదని, వద్దంటే బండి తీసుకువెళ్లి పీకలమీదికి తెచ్చారంటూ ఆవేదన చెందిన సూర్యకుమారి..రూ. 20వేలు ఇవ్వకపోతే తన కొడుకు మీద కేసు అవుతుందని కన్నీళ్లపర్యంతమైంది. మధ్యాహ్నం మరోసారి భర్తకు ఫోన్ చేసిన సూర్యకుమారి డబ్బులు తెచ్చే పరిస్థితి లేదని, చావే శరణ్యమంటూ..ఫోన్ కట్ చేసి.. చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వెంకటరమణ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కారు డ్రైవర్ చంద్రశేఖర్, మహేశ్లపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.