హైదరాబాద్ : సికింద్రాబాద్ వైఎంసీఏ ఫ్లై ఓవర్పై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళను, వేగంగా వచ్చిన ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని బ్యాంకు ఉద్యోగి అయిన సునీతగా పోలీసులు గుర్తించారు. బేగంపేట నుంచి సంగీత్ వైపు మహిళ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అనంతరం డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.