ఖైరతాబాద్, సెప్టెంబర్ 11: ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిని లక్షలాది మంది దర్శించుకున్నారు. భక్తులు దైవ చింతనలో ఉన్న సమయాన్ని అవకాశంగా తీసుకున్న నేరగాళ్లు 134 సెల్ఫోన్లను కొట్టేశారు.
ఈ మేరకు బాధితులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిమజ్జన ఉత్సవంలో మొత్తం 134 ఫోన్లు పోయినట్లు సైఫాబాద్ పోలీసులు తెలిపారు. ఆగస్టు 31 నుంచి 8వ తేదీ వరకు 36 ఫోన్లు పోగా, ఒక్క నిమజ్జనం రోజే 98 ఫోన్లు తస్కరణకు గురైనట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు చెప్పారు. ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.