సిటీబ్యూరో, సెప్టెంబరు 29 (నమస్తే తెలంగాణ ): వినాయక నిమజ్జనం సందర్భంగా వెలువడిన అవశేషాల వెలికితీత పనులను పూర్తి చేసి.. ‘క్లీన్ హుస్సేన్సాగర్’గా మార్చేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చర్యలు వేగవంతం చేశాయి. గణేశ్ నిమజ్జనం పురస్కరించుకుని వినాయక విగ్రహాల తాలూకు వ్యర్థాల తొలగింపు పనులు నిర్విరామంగా కొనసాగించారు. నిమజ్జనం అయిన వెంటనే విగ్రహాలు, వాటికి సంబంధించి అవశేషాలు, పూలు, పత్రిని వెనువెంటనే తొలిగించారు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి వరకు హెచ్ఎండీఏ 3300 మెట్రిక్ టన్నులు, జీహెచ్ఎంసీ 4500 మెట్రిక్ టన్నులు.. మొత్తం 7800 మెట్రిక్ టన్నుల అవశేషాలను తొలిగించినట్లు అధికారులు తెలిపారు.
నిమజ్జనం సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పడిన వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలిగించడానికి నిర్విరామంగా కృషి చేశారని, మండపాలు, 74 కొలనుల వద్ద చెత్త సేకరణకు 3వేల మంది పారిశుధ్య కార్మికులు 24 గంటల పాటు పనిచేశారని తెలిపారు. ఈ వ్యర్థాలు వెలికితీత సమయంలో ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. కాగా, వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జీహెచ్ఎంసీలో పనిచేసే ఎంటమాలజీ కార్మికులు నిమజ్జన కొలనులు, బేబీ పాండ్స్ వద్ద చురుకైన పాత్రను పోషిస్తున్నారు.