మేడ్చల్, మార్చి11(నమస్తే తెలంగాణ)/ ఉప్పల్ : హైదరాబాద్ నగరంలో నిరుపేదల కోసం లక్ష ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా.. ఇప్పటి వరకు 70 వేల ఇండ్లు పూర్తయ్యాయని, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే లబ్ధిదారులకు దశల వారీగా అందజేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో రూ.877 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మల్లాపూర్లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు.
రాష్ర్టానికి పెట్టుబడులు రప్పిస్తూ.. సంపదను సృష్టిస్తూ, పేదల సంక్షేమానికి ఖర్చుచేస్తున్నామని తెలిపారు. ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నామని, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చూసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, ప్రభుదాస్, శాంతిసాయిజెన్ శేఖర్, బొంతు శ్రీదేవి, స్వర్ణరాజ్, గీతా ప్రవీణ్, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు బేతి స్వప్నారెడ్డి, గొల్లూరి అంజయ్య, గంధం జ్యోత్న్సనాగేశ్వర్రావు, గుండారపు శ్రీనివాస్రెడ్డి, కొత్త రామారావు, ధన్పాల్రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పల్లా కిరణ్కుమార్రెడ్డి, కాసం మహిపాల్రెడ్డి, డప్పు గిరిబాబు, మేకల ముత్యంరెడ్డి, నేతలు శైలేష్రెడ్డి, కుంటి కృష్ణ, వాసుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ఇచ్చే ఉద్యోగం కావాలో… మోడీ పకోడి ఉద్యోగం కావాలో తేల్చుకోవాలి
90వేల ఉద్యోగాలను భర్తీచేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటన చేశారని, త్వరలోనే ఉద్యోగ నియామక ప్రకటనలు వెలువడుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. నియోజకవర్గంలో ఉచితంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, యువతకు తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి సూచించారు. సీఎం కేసీఆర్ మాట నమ్మినవారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని, నమ్మనివారు ప్రతి ఏడాది మోడీ ఇస్తామన్న 2 కోట్ల పకోడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో స్టడీ సెంటర్ ఏర్పాటు నిర్ణయం అభినందనీయమని మంత్రి మల్లారెడ్డిని ప్రశంసించారు.
అభివృద్ధి ఇలా..
రాష్ట్రంలో పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి వర్గానికి లబ్ధిచేకూరేలా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
వరదనీటి సమస్య పరిష్కారానికి రూ.900 కోట్లతో నాలాల అభివృద్ధి చేస్తున్నామన్నారు.
మురుగునీటిని శుద్ధి చేయడానికి రూ.3866 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు అందజేస్తామన్నారు.
‘మన ఊరు-మన బడి’ కోసం రూ.7300 కోట్లు కేటాయించామని, ప్రతి బడిలో ఆధునిక వసతులు కల్పిస్తామన్నారు. జూన్ నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
ఇప్పటికే 70 వేల ఇండ్లు నిర్మించామని అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. మొత్తం లక్ష నిర్మించాల్సి ఉందని 70వేలు పోను మిగతావి కూడా త్వరలోనే పూర్తిచేసి లబ్ధిదారులకు ఇస్తామని చెప్పారు.
ఇంటి స్థలం ఉన్న పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలు ఇస్తామన్నారు.
ఉప్పల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు
ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఇరువైపుల రూ.450 కోట్ల వ్యయంతో ైప్లెఓవర్ల నిర్మాణం, అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.35 కోట్లతో స్కైవాక్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఉప్పల్ ప్రాంతానికి శిల్పారామం తీసుకువచ్చామన్నారు.
నగరంలో జూబ్లీహిల్స్లో మహాప్రస్థానం ఒక్కటే ఉండేదని, అలాంటి వసతులతో మల్లాపూర్లో అత్యధునిక వసతులతో కూడిన వైకుంఠధామం ఏర్పాటు అభినందనీయమన్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా వైకుంఠధామాలు ఏర్పాటు చేసేవిధంగా చూడాలన్నారు.
చర్లపల్లిలో ఆర్యూబీ పూర్తిచేస్తామన్నారు.
ఉప్పల్ జెన్పాక్ట్లో కొత్తగా ఐటీ రాబోతున్నదని, దీంతో కొత్తగా ఉద్యోగ అవకాశాలు
వస్తాయన్నారు.
నగరానికి నలువైపులా.. వెయ్యి పడకల దవాఖానలు
గత ప్రభుత్వాలు వైద్యారోగ్య శాఖపై దృష్టిసారించలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీ, ఉస్మానియా దవాఖానలు తప్ప.. ఎక్కడా వైద్య సదుపాయాలు లేవన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేవిధంగా నగరానికి నాలువైపులా వెయ్యి పడకలతో కూడిన నాలుగు కొత్త దవాఖానలు (టిమ్స్) ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.