మాదాపూర్, అక్టోబర్ 27: ఇండియా -జపాన్ల సంబంధాన్ని నేటి యువతరానికి పరిచయం చేయాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జయచంద్ర అన్నారు. ఇండియా, జపనీస్ల స్నేహ బంధాలు పూర్తయి నేటితో 70 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆసా భాను జపాన్ సెంటర్ ఆధ్వర్యంలో ‘ముడిట్ మట్సూరీ’ కార్యక్రమాన్ని గురువారం మాదాపూర్లోని సీసీఆర్టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సెంటర్) లో ఏర్పాటు చేశారు. ఇండో, జపనీస్ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజెప్పేలా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జయచంద్ర విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 21వ శతాబ్దంలో జపాన్, భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. భారత్, జపాన్లు స్థిరమైన అభివృద్ధిని ఆధారంగా చేసుకొని ముందుకెళ్లడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్శించిన్నట్లు పేర్కొన్నారు. కన్సల్ -కల్చర్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ జపాన్, చెన్నయ్ ప్రతినిధి ఇనూ మియూకి మాట్లాడుతూ..ఆసియాలో శాంతి, సుస్థిరత, శ్రేయస్సు అంశాలను పరిగణలోకి తీసుకొని అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇరు దేశాలు కలిసి కట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. జపాన్లో వి ద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు జ పాన్ విద్యా విధానంపై అవగాహన కల్పించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమంలో ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.