Secunderabad | హైదరాబాద్ : సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న దంపతులిద్దరూ మద్యం మత్తులో మునిగారు. దీంతో వారి ఏడు నెలల బాలుడిని గుర్తు తెలియని మహిళ అపహరించింది. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్కు చెందిన పింకీ దేవి, అజయ్ అనే దంపతులిద్దరూ పటాన్చెరులోని ఇస్నాపూర్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. పింకీ, అజయ్ ఇద్దరూ కలిసి మద్యం తాగే అలవాటు ఉంది.
అయితే సొంతూరుకు వెళ్లేందుకు దంపతులు తమ నలుగురు పిల్లలతో కలిసి ఈ నెల 4న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్లోకి వెళ్లే ముందే పింకీ, అజయ్ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరిని మరో మహిళ గమనించింది. ఇక నలుగురి పిల్లలపై దృష్టి సారించిన ఆ మహిళ.. అందరి కంటే చిన్నవాడైన ఏడు నెలల బాలుడిని కిడ్నాప్ చేసింది. మద్యం మత్తు నుంచి తేరుకున్న తర్వాత.. పిల్లాడు కనిపించకుండా పోయాడని పేరెంట్స్ ఆందోళనకు గురై, స్టేషన్ అంతటా వెతికారు. కానీ బాబు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు.. పిల్లాడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ.. చెన్నైలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.