సిటీబ్యూరో, డిసెంబరు 20 (నమస్తే తెలంగాణ) : నగరంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒకే రోజు 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ బులిటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం రోగులందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని, హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే జనావాసాల మధ్యలో తిరగకుండా హోమ్ ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక రోగులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.