హైదరాబాద్: హైదరాబాద్లోని లంగర్హౌస్లో (Langar house) దొంగలు హల్చల్ చేశారు. ఓ ఇంట్లో చోరీకి (Robbery) పాల్పడిన దుండగులు పెద్దమొత్తంలో బంగారం (Gold jewellery), డైమండ్ నగలు (Diamond necklace) ఎత్తుకెల్లారు. లంగర్హౌస్లోని సాలార్జంగ్ కాలనీకి చెందిన మాజిద్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం 5 గంటలకు తన సోదరి ఇంటికి ఇఫ్తార్ విందుకు (Iftar party) వెళ్లారు. విందు ముగిసిన తర్వాత అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు.
అయితే ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో షాక్కు గురయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా.. బీరువా డోరు తెరచి ఉంది. అందులో ఉన్న వస్తువులు, దుస్తులు చిందర వందరగా పడి ఉన్నాయి. మొత్తం చూడగా 50 తులాల బంగారం, రెండు వజ్రాల నగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను చెక్చేస్తున్నారు. బాల్కనీలోని తరుపుల గుండా ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.