కాచిగూడ, డిసెంబర్ 14: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ వద్ద నిర్వహించిన ధర్నాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, చత్తీస్ఘడ్ తదితర రాష్ర్టాల నుంచి వేలాది మంది బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్రావు, బడుగుల లింగయ్య, మాజీ ఎంపీ వి.హనుమంత్రావు హాజరయ్యారు.
అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, బీసీలంటే వాటాదారులన్నారు. దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేకమా.. అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న దాదాపు 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య, నీల వెంకటేశ్, మరేశ్, మహేందర్, వేణుమాదవ్, భూపేశ్సాగర్, నందగోపాల్, రామకృష్ణ, పృథ్వీగౌడ్, డాక్టర్ పద్మలత, ఉదయ్, రవీందర్ తదితరులున్నారు.