మేడ్చల్, మే7 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కేటాయించిన రూ. 50 కోట్ల నిధుల అభివృద్ధి పనులకు టెండర్ల పూర్తితో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది ఆగస్టు 17న కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అభివృద్ధికి రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేశారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, బేతి సుభాశ్రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్ తమ నియోజకవర్గాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలను అధికార యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి నివేదించారు.
కలెక్టర్ అమోయ్కుమార్ ఆదేశాల మేరకు మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో టెండర్లు పూర్తికాగా, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల టెండర్ల పక్రియ మరో మూడు రోజులలో పూర్తికానుందని వెల్లడించారు. టెండర్ల పక్రియ పూర్తయిన మూడు నియోజకవర్గాలలో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అభివృద్ధి పనులలో ప్రధానంగా బీటీ, సీసీ, మట్టిరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, కమ్యూనిటీహాళ్లు, సెంట్రల్ లైటింగ్, విధీలైట్లు, ప్రహరీల నిర్మాణాలు జరగున్నాయి. ఇదిలా ఉంటే టెండర్లు పూర్తి కాగానే పనులను వేగంగా చేయించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. జిల్లా అభివృద్ధికి రూ. 50 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పారు.