సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ ఆదర్శంగా నిలుస్తున్నది. దేశంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయని విధంగా జీహెచ్ఎంసీ 5.29 లక్షల వీధి దీపాలకు ఎల్ఈడీ లైట్లను అమర్చారు. ఇప్పటి వరకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లలో రెండు లక్షలు , విశాఖపట్నం కార్పొరేషన్లో లక్ష ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వాటిని అధిగమించి జీహెచ్ఎంసీ 5.29 లక్షల ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయగా, త్వరలో నగరం అంతటా ఎల్ఈడీ లైట్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేసి దేశంలోనే నగరం అంతటా ఎల్ఈడీలు అందుబాటులోకి తెచ్చిన కార్పొరేషన్గా జీహెచ్ఎంసీ అవతరించనుంది. రహదారుల వెంబడి, జీహెచ్ఎంసీ పారులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, శ్మశానవాటికలు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈ ఎస్ఎల్ ) ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి.
తగ్గిన విద్యుత్ ఖర్చులు..
జీహెచ్ఎంసీలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు ద్వారా ఏటా 162.275 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతోంది. తద్వారా రూ.115.12 కోట్ల విద్యుత్ ఖర్చులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం మొత్తం 690.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా కాగా… రెవెన్యూ పరంగా రూ. 600కోట్ల మేర జీహెచ్ఎంసీకి ఆదా అయింది. ఏడాదికి 1,29,820 టన్నుల కర్భన ఉద్ఘారాలు కూడా తగ్గుతాయని, మొత్తంగా ఇప్పటి వరకు 5,75,736 టన్నుల కర్భన ఉద్ఘారాలు తగ్గాయని విద్యుత్ ఇంజినీర్లు పేర్కొన్నారు. ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుతో రహదారులు ప్రకాశవంతంగా ఉండి రాత్రి ఫూట ప్రమాదాలు ఇప్పటికే చాలా వరకు తగ్గాయని తెలిపారు. విద్యుత్ ఆదాతో మిగిలే నిధులనే వాయిదాల పద్ధతిలో ఈఈఎస్ఎల్కు చెల్లించనుందని అధికారులు చెప్పారు.