పర్యావరణ హితమే కాదు… ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ప్రయాణం దోహదం చేస్తుంది. మోటారు ఆధారిత ప్రజా రవాణా వ్యవస్థను తగ్గిస్తూ మానవ శక్తితో కూడిన రవాణా వ్యవస్థ(నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్టు)గా పిలిచే సైక్లింగ్ను పెంచడమే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ భవిష్యత్ ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది.
నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాలు ఉన్న చోట సైకిల్పై ప్రయాణం చేస్తే విద్యా, ఉద్యోగ, వ్యాపార, వినోద కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు వీలుగా 2031 నాటికి 450 కి.మీ మేర రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయనున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న హైదరాబాద్ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు అథారిటీ(ఉమ్టా) ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన ప్రత్యేకంగా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే హుస్సేన్సాగర్ చుట్టూ నెక్లెస్రోడ్డు, కేబీఆర్ పార్కు, బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి రాజ్భవన్ మీదుగా ఖైరతాబాద్ జంక్షన్ వరకు పైలెట్ ప్రాజెక్టుగా రోడ్లకు ఇరువైపులా సుమారు 30కి.మీ మేర సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరో 163 కి.మీ సైక్లింగ్ మార్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్టు నెట్వర్క్లో భాగంగా ఇండియా సైకిల్స్ 4 చేంజ్ చాలెంజ్లో (ఎంవోహెచ్యూఏ ఇనిషియేటివ్) భాగంగా ఖైరతాబాద్ జోన్ పరిధిలో పైలెట్ కారిడార్ 5.82 కి.మీ మార్గాన్ని బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు వయా రాజ్భవన్ రోడ్డు మీదుగా ఏర్పాటు చేశారు. స్కేల్ ఆఫ్ ఫేజ్-1లో భాగంగా కేబీఆర్ పార్కు, ట్యాంక్బండ్ చుట్టూ సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేశారు. స్కేల్ ఆఫ్ ఫేజ్-2లో భాగంగా ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సోమాజిగూడ, ఎర్రమంజిల్, పంజాగుట్ట,అమీర్పేట మీదుగా సంజీవరెడ్డినగర్ వరకు మరో సైక్లింగ్ ట్రాక్ను ప్రత్యేకంగా నిర్మించనున్నారు.
మహానగరంలో లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్న ప్రాంతంగా ఐటీ కారిడార్ ఉంది. హైటెక్సిటీ మాదాపూర్, కొండాపూర్, రాయిదుర్గం, గచ్చిబౌలి, కోకాపేట, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాలకే అధిక ప్రాధాన్యమిచ్చి 163కి.మీ సైక్లింగ్ ట్రాక్స్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. కేవలం ఐటీ రంగంలోనే సుమారు 5.50లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి తోడు ఇతర రంగాలకు చెందిన వారు సైతం లక్షల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో సైక్లింగ్కు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం ఉమ్టా సంస్థ ప్రత్యేకంగా నగరవాసులతో ఆన్లైన్లో సర్వే నిర్వహించింది. నగరవాసుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్ ప్రజా రవాణాలో సైక్లింగ్కు అధిక ప్రాధాన్యమివ్వాలని, 2031 నాటికి 450కి.మీ మేర సైక్లింగ్ కోసం మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని పవర్పాయింట్ ప్రజెంటేషన్లను రూపొందించి, ప్రభుత్వానికి అందజేశారు.