మేడ్చల్, జనవరి 16 : పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ పథకం ఎంపిక ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. జిల్లా విద్యాశాఖ అధికారులు మార్గదర్శకాల అనుగుణంగా పాఠశాలలను ఎంపిక చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి అర్హత ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి, ఉన్నతాధికారులకు నివేదించారు.
తుది జాబితాలో 43 పాఠశాలలు
మేడ్చల్ నియోజకవర్గంలో ఆరు మండలాల నుంచి పీఎం శ్రీకి అర్హత ఉన్న 43 పాఠశాలలను ఎంపిక చేశారు. సొంత భవనం, విద్యుత్ సౌకర్యం, ఆట మైదానం, బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, సరిపోను టీచర్లు, అధిక ప్రవేశాలు తదితర ప్రమాణాల ప్రాతిపదికన అర్హత ఉన్న పాఠశాలలను ఎంపిక చేశారు. మండల స్థాయిలో ఎంఈవో, నోడల్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి, జిల్లాకు నివేదించారు. మేడ్చల్ మండలం నుంచి 11, కీసర నుంచి 6, మూడుచింతలపల్లి నుంచి మూడు, మేడిపల్లి నుంచి 5, శామీర్పేట నుంచి 9, ఘట్కేసర్ నుంచి 9 చొప్పున ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ 43 పాఠశాలల నుంచి చివరగా మండలానికి రెండు చొప్పున ఒక ప్రాథమిక, ఒక ఉన్నత పాఠశాల చొప్పున మొత్తం 12 పాఠశాలలను ఎంపిక చేస్తారు.
ఎంపికైన పాఠశాలకు ఐదేండ్లలో రూ.2 కోట్లు ..
సంపూర్ణ మూర్తిమత్వాన్ని విద్యార్థుల్లో సాధించడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి స్కూల్ రైజింగ్ ఫర్ ఇండియా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మండలం యూనిట్ ప్రాతిపదికన ఒక ప్రాథమిక పాఠశాల, ఒక ఉన్నత పాఠశాలను ఎంపిక చేస్తారు. ఎంపికైన పాఠశాలలకు ఏడాదికి రూ.40 లక్షల చొప్పున ఐదేళ్లలో రూ.2 కోట్లను అందజేస్తారు. ఇందులో 60 శాతం నిధులను కేంద్రం ఇవ్వనుండగా, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ నిధులతో ఇంటియారాక్టివ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ల్యాబ్స్ ఏర్పాటు, అదనపు తరగతి గదుల నిర్మాణం, పిల్లల్లో క్రీడాభివృద్ధి, వివిధ కళల్లో శిక్షణ తదితర చర్యలను తీసుకుంటారు. ఎంపిక ప్రక్రియను పూర్తి స్థాయిలో మార్చి వరకు పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం నిధులను విడుదల చేయనుందని అధికారులు తెలిపారు.
మండలాల వారీగా అర్హత సాధించిన పాఠశాలలు..
మేడ్చల్ : అత్వెల్లి ఎంపీపీఎస్, ఎంపీపీఎస్ హనుమాన్నగర్, ఎంపీపీఎస్ మునీరాబాద్, ఎంపీపీఎస్ నూతన్కల్, ఎంపీపీఎస్ రావకోల్, ఎంపీపీఎస్ రైల్వేస్టేషన్ రోడ్, ఎంపీపీఎస్ శ్రీరంగవరం, జడ్పీటీహెచ్ఎస్ డబిల్పూర్, జడ్పీహెచ్ఎస్ గౌడవెల్లి, జడ్పీహెచ్ఎస్ గుండ్లపోచంపల్లి, జడ్పీహెచ్ఎస్ రావల్కోల్ పాఠశాలలను ఎంపిక చేశారు.
మేడిపల్లి : ఎంపీపీఎస్ బోడుప్పల్, ఎంపీపీఎస్ కమలానగర్, ఎంపీయూపీఎస్ పర్వాతపూర్, జడ్పీహెచ్ఎస్ బోడుప్పల్, జడ్పీహెచ్ఎస్ పీర్జాదిగూడ
శామీర్పేట : ఎంపీపీఎస్ లాల్గడీమలక్పేట, ఎంపీపీఎస్ తూంకుంట, జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ ఉప్పరిపల్లి, జడ్పీహెచ్ఎస్ అలియాబాద్, జడ్పీహెచ్ఎస్ దేవరయాంజాల్, జడ్పీహెచ్ఎస్ శామీర్పేట, జడ్పీహెచ్ఎస్ తూంకుంట, జడ్పీహెచ్ఎస్ తుర్కపల్లి
ఘట్కేసర్ : ఎంపీపీఎస్ అంకుషాపూర్, ఎంపీపీఎస్ ఘట్కేసర్, ఎంపీపీఎస్ ఎన్ఎన్ కాలనీ, ఎంపీపీఎస్ ప్రతాపసింగారం, ఎంపీపీఎస్ చౌదరిగూడ, జడ్పీహెచ్ఎస్ అన్నోజిగూడ, జడ్పీహెచ్ఎస్(బాలుర), ఘట్కేసర్, జడ్పీహెచ్ఎస్ కొర్రెముల, జడ్పీహెచ్ఎస్ ప్రతాపం సింగారం.
కీసర : ఎంపీపీఎస్ కరీంగూడ, ఎంపీపీఎస్ నాగారం, ఎంపీపీఎస్ రాంపల్లి, జడ్పీహెచ్ఎస్ చీర్యాల్, జడ్పీహెచ్ఎస్ దమ్మాయిగూడ, జడ్పీహెచ్ఎస్ రాంపల్లి
మూడుచింతలపల్లి : ఎంపీపీఎస్ కొల్తూర్ హరిజనవాడ, ఎంపీపీఎస్ లక్ష్మాపూర్, జడ్పీహెచ్ఎస్
లక్ష్మాపూర్.
విద్యాభివృద్ధికి దోహదం
విద్యాభివృద్ధికి పీఎం శ్రీ పథకం దోహద పడుతుంది. ఏడాదికి రూ.40 లక్షల చొప్పున ఐదేళ్లలో వచ్చే రూ.2 కోట్ల నిధులతో ఎంపికైన పాఠశాలలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోంది. పాఠశాలల్లో సౌకర్యాల మెరుగుకు భారీగా నిధులను వెచ్చిస్తుంది. ఇప్పటికే మేడ్చల్, శామీర్పేట మండలాల్లోని ఎన్నో పాఠశాలలను ప్రభుత్వ, దాతల సహకారంతో మెరుగుపర్చుకున్నాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొటర్ పాఠశాలలకు ధీటుగా సౌకర్యాలను సమకూర్చుకొని, ఉన్నత ఫలితాలను సాధించే దిశగా సాగుతున్నాయి
-వసంతకుమారి, మండల విద్యాధికారి, మేడ్చల్, శామీర్పేట