మహానగరంలో ఐదేండ్ల పండుగ జరుపుకొంటున్న మెట్రోరైలు చరిత్రలో మరో మైలురాయి చేరింది. సోమవారం ఒక్కరోజే 4.40లక్షల మంది మెట్రోలో ప్రయాణించి అరుదైన ఘనత సాధించారు. మరో వైపు పంచమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం అమీర్పేట మెట్రో స్టేషన్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణ జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాలకు హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ హెచ్ఎంఆర్ఎల్ ఎండీ అండ్ సీఈవో కేవీబీ రెడ్డి, కియోలిస్ గ్లోబల్ ప్రతినిధి బెర్నాడ్లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులను సత్కరించి, మెట్రోలో అత్యధిక సార్లు ప్రయాణించిన 25 మందిని ఎంపిక చేసి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కాగా, రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలు ఫేజ్ 2 ప్రాజెక్టును ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
సిటీబ్యూరో/అమీర్పేట నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు ఐదేండ్ల సంబురాలు అంబరాన్నంటాయి. నగర ప్రజలకు విజయవంతంగా మెరుగైన ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తూ ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, హోరెత్తించే అధికారుల డ్యాన్స్లతో అమీర్పేట మెట్రో స్టేషన్లో పండుగ వాతావరణం నెలకొంది. అమీర్పేట మెట్రో స్టేషన్లో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రయాణికులతో కలిసి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు ఆడిపాడారు. తెలంగాణ జానపద నృత్యం ఒగ్గు కథతో పాటు సితార్, సరోద్, తబలా ప్రదర్శనలతో కళాకారులు ఆకట్టుకున్నారు.
మంగళవారం మధ్యాహ్నం అమీర్పేట మెట్రో స్టేషన్లో నిర్వహించిన ఉత్సవాలకు హైదరాబాద్ మెట్రో రైలు ఎం.డి ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో ఎం.డి, సీఈఓ కేవీబీ రెడ్డి, కియోలిస్ గ్లోబల్ ప్రతినిధి బెర్నాడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫోన్పే, ఇతర సంస్థల ప్రతినిధుల సమక్షంలో వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ ఐదు సంవత్సరాల ప్రయాణంలో మెట్రో రైల్ను ఆదరించిన ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపారు. మెట్రోకు రోజురోజుకు ఆదరణ పెరగడం అభినందనీయం అన్నారు. మెట్రో ప్రయాణంలో భాగస్వామి ఎల్ అండ్ టీ హెచ్ఎంఆర్ఎల్కు, సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో మెట్రో రైల్లో మొదటి నుంచి అత్యధికంగా ప్రయాణాలు చేసిన 15 మందికి గిఫ్ట్ ఓచర్లను అందించారు. మరో 10 మందికి కస్టమర్ లాయల్టీ ప్రోగ్రాం ద్వారా గుర్తించి గిఫ్ట్ ఓచర్లను అందజేశారు. కార్యక్రమంలో ఫోన్ పే డైరెక్టర్ రితురాజ్, తదితరులు పాల్గొన్నారు.