సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): డ్రై డే (నిషేధిత రోజు) రోజున అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపిన 12 బెల్టు షాపులపై సైబరాబాద్ ఎస్ఓటీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 12 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4.03లక్షల విలువజేసే 365 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ నెల 17న మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం అమ్మకాలు చేపట్టవద్దంటూ ఆంక్షలు విధించారు. దీనిని ఆసరాగా చేసుకొని..
దుండిగల్, అల్వాల్, సురారం, మేడ్చల్, బాచుపల్లి, ఆర్సీ పురం, చందానగర్, గచ్చిబౌలి, మియాపూర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, నార్సింగి పోలీసు స్టేషన్ల పరిధిలో మద్యం మాఫియాలు అక్రమంగా బెల్టు షాపుల ద్వారా పెద్ద ఎత్తున మద్యం విక్రయాలకు పాల్పడ్డారు. ఈ మేరకు సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసు బృందాలు రంగంలోకి దిగి, ఆయా ఠాణాల పరిధిలో పెద్ద ఎత్తున దాడులు జరిపారు. ఈ దాడుల్లో 12 పోలీసు స్టేషన్ల పరిధిలో 12 అక్రమ మద్యం కేంద్రాలను నిర్వహిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4,03,806ల విలువజేసే 365 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసులను సంబంధిత ఠాణాలకు అప్పగించారు.